Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Thursday, August 11, 2005

కాకతీయ యుగము - వంశనామము - వంశోత్పత్తి

కాకతీయ యుగము - వంశనామము - వంశోత్పత్తి

కాకతీయుల వంశనామము కాకిత, కాకెత, కాకర్త్య, కాకతి రూపాల్లో కనబడుతుంది. కాకతి అనే ఊరుపేరునుబట్టికాని, కాకతి అనే దేవతనుబట్టికాని ఆ పేరు వచ్చి ఉండవచ్చు.

విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథానికి వ్యాఖ్యానం చేసిన కుమారస్వామి సోమపీఠి, కాకతి అనే దేవతను ఆరాధించడం వల్ల వారు కాకతీయులు అయినట్లు వివరించాడు.

క్రీడాభిరామం లో 'కాకతమ్మకు సైదోడు ఏకవీర' అని వర్ణించారు. హనుమకొండ దుర్గం లోని కొండ మీది పద్మాక్షి దేవి కాకతమ్మ అయి ఉండవచ్చా లేక ఆమెకు ఓరుగల్లు లో వేరే ఆలయం ఉండేదా అన్నది తెలియదు.

రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని పాలించిన వీరభద్రారెడ్డి భార్య అనితల్లి వేయించిన కలువచేరు శాసనం లో కాకతీయులు గుమ్మడి తీగకు పుట్టినట్లు రాశారు. వంశానికి మూలపురుషుడైన మాధవవర్మ కుమారుడు పద్మసేనుడికి సంతానం లేక, హనుమకొండ పద్మాక్షి ని గుమ్మడికాయల తో పూజిస్తే కొడుకు పుట్టాడని సిద్ధేశ్వర చరిత్రలో కనబడుతుంది. ఆ వృత్తాంతమే కలువచేరు శాసనం లో కథగా పరిణమించింది.

ఇవన్నీ చూస్తే కాకతి అనే దేవత నుండి వంశనామాన్ని సృష్టించడం తర్వాతెప్పుడో జరిగినట్లనిపిస్తుంది. కాకిత లేక కాకతి అనే గ్రామం వల్ల వీరు కాకతీయులయారనడం ఎక్కువ విశ్వసనీయం గా ఉంది.

రెండవ బేతరాజు (1075-1111) తన కాజీపేట శాసనం లో తన తాత అయిన మొదటి బేతరాజు గురించి "సామంతవిష్టివశః (వంశ్యః కావచ్చు) శ్రీమాన్ కాకతి పురాధినాథోబేతః" అని రాయించాడు. ఈ మొదటి బేతరాజే కాకతీయ వంశానికి మూలపురుషుడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతి పురాధినాథుడనీ చెప్పడం గమనించదగింది.

హనుమకొండకీ, ఓరుగల్లుకీ కాకతిపురం అనే పేరు ప్రచురంగా లేదు. అదొక గ్రామమై ఉండవచ్చు.

చోళులు తామెక్కడున్నా, ఎంత చిన్న కుటుంబమైనా "ఒరయూరు పురవరాధీశ్వర" అని రాయించుకుంటుంటారు.
రేచెర్ల పద్మనాయకులు "ఆమనగంటి పురవరాధీశ్వర" అని రాయించుకుంటుంటారు.
అలాంటిదే ఈ కాకతిపురం కూడా అనుకోవాలి. కాకతి, కాకెత అనే పేరుగల గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో వీరిది ఏదో చెప్పడం కష్టమైనా ప్రయత్నించవచ్చు.

మొదటి బేతరాజు కు ముందే కాకర్త్య గుండ్యన అనే పేరు వినవస్తూంది. ఇతను తూర్పు చాళుక్యుడైన రెండవ అమ్మరాజు (945-970) కాలం వాడు. అమ్మరాజు వేయించిన మాగల్లు శాసనం లో కనబడుతున్నాడు. కాకర్త్య గుండ్యన ప్రార్థన మీద రెండవ అమ్మరాజో, ఆయన సవతి అన్న దానార్ణవుడో ఒక బ్రాహ్మణుడికి భూదానం చేసినట్లు ఈ శాసనం చెబుతుంది. గాలి నరసయ్య కాస్తా వాతూల అహోబలపతి అయినట్లు కాకతి గుండయ కాకర్త్య గుండ్యన అనే పేరుతో కనబడినా ఆశ్చర్యం లేదు.

ఇతని తండ్రితాతలకు రాష్ట్రకూట బిరుదముంది. ఇతనిది సామంత ఒడ్డె వంశము. ఒడ్డె అనేది ఓఢ్ర (Orissa) శబ్దభవం. విశాఖపట్నం జిల్లాలోని వడ్డాది ముఖ్యపట్నంగాగల ప్రాంతం వడ్డెనాడు, ఒడ్డెనాడు కావచ్చు. వడ్డాదికి సమీపం లో కాకతి అనే గ్రామం ఉందని చిలుకూరు వీరభద్రరావు పంతులు గారు గుర్తించారు.

ఈ విషయాలన్నీ సమన్వయం చేస్తూ కాకర్త్య గుండ్యన పూర్వులు ఒడ్డెనాడు కు చెందినవారనీ, అతని తండ్రితాతలో, లేక అతడో గోదావరి దాటివచ్చి తూర్పు చాళుక్యుల వద్ద ఉద్యోగులుగా కుదురుకున్నారనీ చెప్పవచ్చు.

3 Comments:

Blogger simplyme said...

Wow...lots of info

Thursday, August 11, 2005 12:25:00 PM  
Anonymous Anonymous said...

Studying history is very similar to following Friends or Seinfeld. Characters తెలియాలి, అంతే. అప్పుడే బాగా appreciate చేయగలం.

ఇక మన daily serials వదలకుండా చూసే ప్రజానీకానికైతే సమస్యే లేదు. నిజం చరిత్ర లో కూడా అన్ని పాత్రలూ, మలుపులూ ఉండవేమో. అసలు, తమిళ డబ్బింగ్ సీరియల్ వస్తోందని జనాలని ఊరించి, మన చరిత్ర ని, lip sync లేకుండా, ఒక సీరియల్ లాగా తీసి ప్రసారం చేస్తే అందరికీ మంచిది.

Thursday, August 11, 2005 1:03:00 PM  
Blogger రాయుడు said...

ఒడ్డె రాజులు గొప్పవారు.

Sunday, August 09, 2015 9:56:00 AM  

Post a Comment

<< Home